అమరావతి :
రానున్న పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల వద్ద ప్రత్యేక వసతులు కల్పించాలని రాష్ట్ర మైనారిటీ & న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని కలిసి వినతి పత్రం అందజేసినట్లు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో అన్ని మసీదులకు మరమ్మత్తుల కొరకు ప్రతి ఏటా ఇచ్చే 25000/- రూపాయలు మంజూరు చెయ్యాలని, శిక్ష అనుభవిస్తున్న ముస్లిం ఖైదీలకు సహారీ, ఇఫ్తార్ ఏర్పాటు కొరకు జైళ్ల శాఖకు ఆదేశించాలని, ప్రభుత్వం తరపున రంజాన్ ఉత్సవాలు (జష్నే రంజాన్) నిర్వహించాలని అలాగే రానున్న బడ్జెట్ లో మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేకంగా 3296 కోట్లు మంజూరు చెయ్యాలని విన్నవించడం జరిగిందన్నారు. మైనారిటీ శాఖ మంత్రి స్పందిస్తూ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సానుకూలంగా స్పందిస్తూ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉలేమా వింగ్ అధ్యక్షులు మౌలానా అబ్దుల్ రషీద్, నాయకులు సగీర్, ఖాజా, అర్షద్, భాష తదితరులు పాల్గొన్నారు.
